కరోనా వైరస్ గురించి మనం ఇప్పటి వరకు వినడమేగానీ.. ఆ వ్యాధికి గురైన రోగులు పడే అవస్థను ఎప్పుడూ చూడలేదు. చైనా తర్వాత అత్యధిక బాధితులతో విలవిల్లాడుతున్న ఇటలీలో పరిస్థితి దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడి హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న రోగులు ‘ఊపిరి’ కోసం పడుతున్న బాధను చూస్తే.. గుండె బరువెక్కుతుంది.

కరోనా వైరస్ నేరుగా ఊపిరితీత్తుల్లోనే తిష్ట వేస్తుంది. ముక్కు, నోరు లేదా కళ్ల నుంచి నేరుగా ఊపిరితీత్తుల్లోకి చేరే వైరస్.. అక్కడి కణాలను నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది చేసే దాడిని తట్టుకొనే రోగ నిరోధక శక్తి శరీరానికి ఉంటే.. తప్పకుండా ప్రాణాలతో బయటపడవచ్చు. లేకుంటే.. వైరస్ పెట్టే హింసను భరిస్తూ నరకయాతన అనుభవించాలి.అందుకే, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులే ఈ వైరస్కు బలవ్వుతున్నారు. ఊపిరితీత్తుల్లో వైరస్ నాశనం చేసే కణాలన్నీ కఫం ద్వారా బయటకు వస్తాయి. ఆ తర్వాత ఊపిరి తీత్తులకు ఇన్ఫెక్షన్ సోకి.. నీరు పడుతుంది. అది కాస్తా న్యూమోనియాకు దారి తీస్తుంది. ఫలితంగా రక్తానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఆ తర్వాత కిడ్నీల ఫెయిల్యూర్ లేదా మరేదైనా అవయవం పనిచేయడం నిలిచిపోవడం ద్వారా మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.ఇటలీలో ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూసిన కోవిడ్-19 బాధితులే. వీరిలో చాలామంది ఊపిరి అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యులు వారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఇటలీలోని లాంబార్డీ రీజియన్లోని బెర్గామో ప్రాంతలో గల పాపా గియోవన్నీ XXII హాస్పిటల్లోని కరోనా రోగులు పడుతున్న ఈ ఇబ్బందులను చూస్తే తప్పకుండా మీ గుండె బరువెక్కుతుంది. వారికి శ్వాస అందించేందుకు వైద్యులు ఎంతో శ్రమిస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలు సైతం వారి ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి.

‘స్కైన్యూస్’ వార్తా సంస్థ హాస్పిటల్లో ఈ దయనీయ దృశ్యాలను యూట్యూబ్లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఐసీయూలో రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ లోరెంజో గ్రాజియోలి మాట్లాడుతూ.. ‘‘ఇది తీవ్రమైన న్యూమోనియా. వైద్య వ్యవస్థపై ఇదెంతో ఒత్తిడి కలిగిస్తోంది. రోజుకు 50 నుంచి 60 మంది రోగులు ఎమర్జెన్సీ డిపార్టుమెంటులో భర్తీ అవుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి దయనీయంగా ఉంటోంది. వారికి భారీగా ఆక్సిజన్ అవసరం అవుతోంది. అందుకే హాస్పిటల్లో మూడు స్థాయిల్లో ఐసీయూలను ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.ప్రస్తుతం ఇటలీలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రోజుకు వందలాది మంది చనిపోతున్న నేపథ్యంలో బెర్మగాలోని స్మశానాన్ని మార్చురీగా మార్చేశారు. వైరస్తో చనిపోయినవారి శవాలను తరలించేందుకు ఇటలీ యావత్తూ సైనికుల ట్రక్కులను ఏర్పాటు చేశారు. గురువారం ఇటలీ విచ్చేసిన చైనా రెడ్ క్రాస్ టీమ్.. అక్కడి సదుపాయాలపై విమర్శలు గుప్పించింది. ఇటలియన్లు క్వారంటైన్, లాక్డౌన్లను తీవ్రంగా పరిగణించలేదని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి